ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్, బిపిల బారీన పడుతున్నారు.. ఇవి ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం ఉంటాయి..ఇక ముందులు వాడుతూనే ఉండాలి..ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవన విధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం షుగర్ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలు పెరిగి మరిన్ని ఇబ్బందుల్లో పడటం ఖాయం..అయితే కొన్ని ఆహార నియమాలను పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు అంటున్నారు..అవేంటో తెలుసుకుందాం..
ఆకుకూరలు..
షుగర్ పేషెంట్లకు అన్ని రకాల ఆకు కూరలు మంచివే. అయితే అన్నిటికంటే పాలకూర ఇంకా మంచిది. ఎందుకంటే దీనిలో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకుండా చూస్తుంది. దీనివల్ల ఆహారంలోని చక్కెరలు ఒకేసారి రక్తంలో కలువకుండా ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదు.
పప్పు దినుసులు..
షుగర్ పేషెంట్ల ఆహారంలో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుంచి లభించే ప్రొటీన్లు మాంసాహారంలో లభించే ప్రొటీన్ల కంటే మేలైనవి. ఇవి ప్రొటీన్లతోపాటు ఫైబర్స్ను కూడా అధికంగా కలిగి ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది..
కాయకూరలు..
మధుమేహం ఉన్నవారు టమాట, వంకాయ, బీరకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయ, మునగకాయ, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అయితే, వీటన్నిటికంటే టమాటాలు మరింత శ్రేష్ఠమైనవి. వీటిలో కేలరీలు తక్కువ. C విటమిన్ ఉంటుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అందుకే విటమిన్ A ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది..
చేపలు..
మధుమేహం ఉన్నవారు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్, ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు వారంలో ఒక్క రోజైనా చేపలను తింటే మంచిది.. అది కూడా పులుసు అయితే మరీ మంచిది..
వీటితో పాటు తాజా పండ్లు, మజ్జిగ కూడా తాగొచ్చు.. అలాగే రొట్టెలు తిన్నా కూడా మంచిదే.. ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే టైమ్ కు తినడం అలవాటు చేసుకోవాలి..