అందరి వంటింట్లో.. ధనియాలు లేదా ధనియా పౌడర్ కచ్చితంగా ఉంటుంది. వంటల్లో ఇది వస్తే ఆ వాసనే మస్త్ ఉంటుంది. కొత్తిమీర, ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి వంటలకు రుచినే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ధనియాల్లో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే వీటిని వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు బాధపెడుతున్నప్పుడు చాలా మంది మందులను వాడుతూ ఉంటారు. దీని వల్ల కాలేయం కొంతకాలానికి దెబ్బతినే అవకాశం ఉంది. మనం ధనియాలను ఉపయోగించి ఈ సమస్యలను నయం చేసుకోవచ్చు. ధనియాలు, పసుపు, పటిక బెల్లాన్ని సమానంగా తీసుకుని బరకగా దంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక టీ గ్లాస్ నీటిలో వేసి పావు గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయన్ని గోరు వెచ్చగా పూటకు నాలుగు టీ స్పూన్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.
అలాగే ధనియాలను పొడి ఒక గ్లాస్ నీళ్లల్లో వేసి అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా జులబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రేగుల్లో పురుగులు, నులి పురుగులు వంటి సమస్యలతో కూడా మనలో చాలా మంది బాధపడతారు.
శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచడంలో ధనియాలు మనకు ఉపయోగపడతాయి. ఒక టీ స్పూన్ ధనియాలకు ఒక టీ స్పూన్ పంచదార కలిపి కచ్చా పచ్చాగా దంచాలి. ఒక మిశ్రమాన్ని నాలుగు గ్లాసుల నీటికి కలిపి ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయానికి కొద్దిగా ఉప్పును కలపాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని నాలుగు టీ స్పూన్ల మోతాదులో రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు..
ధనియాలను ఉపయోగించి మనం అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక టీ స్పూన్ ధనియాలకు చిటికెడు శొంఠి పొడిని కలిపి మెత్తగా దంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటికి కలిపి పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పూటకు నాలుగు టీ స్పూన్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గు ముఖం పడుతుంది.
ఇలా ధనియాలను సరైన మోతాదులో వాడుకుంటే ఆ సమస్యలన్నీ నయం చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వాడితే కడుపులో మంట వస్తుంది. కాబట్టి చెప్పిన మోతాదులోనే వాడుకోని మంచి ప్రయోజనాలను పొందండి.