జీవన శైలి, ఆహారపు అలవాట్లో మార్పు కారణంగా ఈ రోజుల్లో దీర్ఘకాల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ఒకసారి డయబెటిస్ వస్తే జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉండాల్సిందే. ఇంకా డయాబెటిస్ ఉన్నవారు తిండి విషయంలో చాలాసార్లు నోరు కట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుక తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్వీట్లు నోరూరించినా.. తినలేని పరిస్థితి ఉంటుంది.
అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పరిమాణంలో ఈ మిఠాయిలను తినొచ్చు. కానీ రక్తంలో చక్కెర నియంత్రణలో ఉన్నవారు మాత్రమే ఇది చేయాలి. చక్కెర నియంత్రణ లేని రోగులు అస్సలు స్వీట్ల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అది ప్రమాదం.
డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు ఒకవేళ స్వీట్స్ తినాలనిపించినప్పుడు రక్తంలో చక్కెర శాతం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అలానే తినే ముందు ఫైబర్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత కొవ్వు ,కార్బోహైడ్రేట్లు ఉన్న వాటిని తీసుకోవాలి. దీని తర్వాతే స్వీట్స్ తినాలి. ఇలా చేయడం వల్ల షుగర్ మీద స్వీట్స్ తిన్న ప్రభావం ఎక్కువగా పడదు అయితే ఇదే సమయంలో తీపి పదార్థాలు అధికంగా మాత్రం తీసుకోకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు. ఎందుకంటే షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్లు టిఫిన్ చేసిన తర్వాత లేదంటే భోజనం చేసిన తర్వాతే తినాలి.
అదేవిధంగా రాత్రివేళల్లో షుగరు ఉన్నవారు స్వీట్లు తినకూడదు. దీనివల్ల నిద్రకు ఇబ్బంది కలగడం తో పాటు రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే రాత్రిపూట స్వీట్స్ తీసుకోకుండా ఉండాలి.
అంతేకాకుండా ఈ వ్యాధితో బాధపడేవారు.. స్వీట్లను మాత్రమే తింటే మంచిది. కూల్ డ్రింక్స్, తీపి రసాలకు దూరంగా ఉండాలి. ఈ ద్రవ పదార్థాలు కూడా రక్తంలో చక్కెర శాతాన్ని వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్, ఇన్సులిన్ తీసుకునే వారు ఎలాంటి స్వీట్లు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే తన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.